BJP Vs Congress : దేశంలో పొలిటికల్గా మునుపటి పూర్వవైభవం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే భారత్ జోడో యాత్రను ప్రారంభించింది. ఈ యాత్రను కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్నారు. యాత్ర మాట ఎలా ఉన్నా కూడా ఈ యాత్రలో రాహుల్ టీ షర్టులో ఆకట్టుకుంటున్నారు. దీంతో బీజేపీ కూడా ఆయన టీ షర్ట్ పైనే ఫోకస్ చేసింది. యాత్ర సందర్భంగా రాహుల్ ధరించిన టీ షర్టు ధరపై సోషల్ మీడియా వేదికగా బీజేపీ పోస్టులు పెడుతోంది. దీంతో కాంగ్రెస్.. ప్రధాని మోదీ ధరించే సూట్ను టార్గెట్ చేసి ధరను చెప్పడం పొలిటికల్గా హాట్ టాపిక్గా మారింది.
మొత్తానికి ఈ టీ షర్ట్ టాపిక్ కాస్తా.. బీజేపీ-కాంగ్రెస్ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల వార్ నడుస్తోంది. పాదయాత్రలో రాహుల్ గాంధీ తెలుపు రంగు టీ షర్ట్ ధరించారు. ఆ టీ షర్ట్ బర్బెర్రీ బ్రాండ్కు చెందినది అని.. టీ షర్ట్ ధర రూ.41,000 అంటూ బీజేపీ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ఈ సందర్భంగా రాహుల్ ఫొటోకు ‘భారత్ దేఖో’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. రాహుల్ రూ.41 వేల టీషర్ట్కే బీజేపీ పోస్ట్ పెడితే.. మోదీ ధరించి కోట్ల విలువైన దుస్తుల కాంగ్రెస్ ప్రస్తావించకుండా ఉంటుందా? బీజేపీకి కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
BJP Vs Congress : మోదీ ధరించిన సూటు రూ.10 లక్షలు.. కళ్లద్దాలు రూ.1.5 లక్షలు
గతంలో ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన సూటు ధరను సోషల్ మీడియా వేదికగా మరోమారు వెలుగులోకి తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ వేదికగా.. ‘భారత్ జోడో యాత్ర సందర్భంగా వస్తున్న ప్రజా స్పందనను చూసి బీజేపీ నేతలు భయపడుతున్నారా?’ అంటూ కౌంటర్ ఇచ్చింది. ‘డ్రెస్సుల గురించి కాదు.. దేశంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడండి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడండి. మనం బట్టల గురించే మాట్లాడుకోవాల్సి వస్తే ప్రధాని మోదీ సూట్ల గురించి మాట్లాడాలి. మోదీ ధరించిన రూ.10 లక్షల సూటు, రూ.1.5 లక్షల కళ్లద్దాల గురించి కూడా మాట్లాడుకుందామా’ అంటూ రివర్స్ దాడికి దిగింది. దీంతో సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ట్వీట్స్ వార్ నడుస్తోంది.