Munugode ByPoll: మునుగోడు ఉపఎన్నిక.. ఎలాగైనా విజయం సాధించాలని పార్టీలన్నీ అదే పనిగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సైతం తన వ్యూహాలను మార్చి వేసింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించిన తరువాత పార్టీ శ్రేణులు రంగంలోకి దిగాయి. రాష్ట్ర స్థాయి నాయకులు, ముఖ్య నేతలంతా మండలాల్లో పర్యటిస్తుండడంతో కాంగ్రెస్ క్యాడర్లో కదలిక మొదలైంది. ఈ దూకుడును పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ వ్యూహరచన, ప్రచార కమిటీ కన్వీనర్గా టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. ఆ బాధ్యతల నుంచి మాజీ ఎంపీ మధుయాస్కీగౌడ్ను తప్పించింది.
అభ్యర్థి ఎంపిక తర్వాత పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అన్ని మండలాలకు రాష్ట్ర స్థాయి నాయకులను ఇన్చార్జీలుగా నియమించింది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు బ్యాంకును పెంచి.. తద్వారా విజయం సాధించడమే లక్ష్యంగా వీరంతా పని చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇప్పటికే రెండుసార్లు నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన నారాయణపూర్ మండలం ఇన్ఛార్జిగా ఉండగా, ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క, శ్రీధర్బాబు వంటి నేతలు మండలాల ఇన్చార్జీలుగానే కాకుండా, ఇతర మండలాల్లోనూ పర్యటిస్తున్నారు. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఎత్తుగడలను ముఖ నేతలకు చెబుతూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో కేడర్లో సైతం కదలిక వచ్చింది.
Munugode ByPoll: అందుకే మధుయాష్కీని తప్పించారు..
నవంబరు లేదా డిసెంబరులో ఉప ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ వ్యూహరచన, ప్రచార కమిటీ కన్వీనర్ను అధిష్టానం మార్చింది. ఇప్పటి వరకూ కమిటీకి కన్వీనర్గా ఉన్న మధుయాస్కీ గౌడ్ను ఆ బాధ్యతల నుంచి తప్పించి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డిని నియమించింది. దీంతో ఆయన స్థానికంగా ఉండి పూర్తి స్థాయిలో దృష్టి సారించి పని చేసేలా ఈ మార్పు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అక్టోబరు 24వ తేదీన రాష్ట్రంలో ప్రారంభం కానుంది. అప్పటికి మునుగోడులో ఎన్నికల జోరు పెరగనుంది. ఆ సమయంలో మధుయాస్కీగౌడ్ రాహుల్ యాత్రకు సంబంధించిన వ్యవహారాల్లో ఉంటే మునుగోడులో కార్యక్రమాలకు ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఆయన్ని తప్పించినట్లు తెలిసింది.