Modi: ప్రధాని మోదీ తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి 95వ సారి ప్రసంగించారు. జీ20 శిఖరాగ్ర సదస్సు, అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రో శాస్త్రవేత్తలు సాధిస్తోన్న ప్రగతిని, భారత్ – భూటాన్ సంబంధాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు అనే థీమ్తో భారత్లో జీ 20 సదస్సు జరుగుతుందని తెలిపారు. ఇటీవల జరిగిన విక్రమ్- ఎస్ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేయడం ద్వారా భారత్- అంతరిక్ష పరిశోధనల్లో మరో మైలురాయి చేరుకుందన్నారు ప్రధాని మోదీ.
ప్రధాని మోదీ మన్కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. హరిప్రసాద్ తన స్వహస్తాలతో నేసిన G-20 లోగోను తనకు పంపినట్లు వెల్లడించారు. అద్భుతమైన బహుమానం చూసి ఆశ్చర్యపోయానన్న మోదీ.. తన కళతో అందరి దృష్టిని ఆకర్షించే స్థాయిలో హరిప్రసాద్ నైపుణ్యం ఉందని కొనియాడారు.
హరిప్రసాద్ సూచనలను ఆచరణలో పెడతాం: మోదీ
తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన చేనేత కళకు హరిప్రసాద్ కొత్త సొబగులు అద్దారని ప్రశంసించారు. తనకు పంపిన లేఖలో హరిప్రసాద్.. చేనేత పరిశ్రమ గురించి అనేక సూచనలు చేసినట్లు తెలిపారు. ఆ సూచనలు పరిశీలించి ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది జీ-20 సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వడం గర్వించదగ్గ విషయమని అతను తెలిపారన్నారు.
Modi:
దీంతో కళాకారుడు హరిప్రసాద్ తో పాటు జిల్లా బీజేపీ శ్రేణులు ఆనందోత్సాహంలో మునిగిపోయారు. సిరిసిల్ల చేనేత ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన కళాకారుడు హరి ప్రసాద్ ని జిల్లా బిజెపి నాయకులు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.