Kalyan Ram: ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు వైసిపి ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చి ఆమోదం పొందించుకోవడం తెలిసిందే. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులతోపాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఇంకా ఇదే సమయంలో నందమూరి కుటుంబం సైతం వైయస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండించింది.
ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించి.. పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ స్థాయిని తగ్గించలేరని తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఇక లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ కూడా ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై సోషల్ మీడియాలో సీరియస్ వ్యాఖ్యలు చేశారు. “1986లో విజయవాడలో మెడికల్ యూనివర్శిటీ స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ లోని 3 ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య, విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న శ్రీ ఎన్టీఆర్ గారు ఈ మహావిద్యాలయనికి అంకురార్పణ చేశారు. ఈ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందింది మరియు లెక్కలేనన్ని నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులను దేశానికి అందించింది.
తెలుగు రాష్ట్రాలలో వైద్య అధ్యయనాల మెరుగుదలకు ఆయన చేసిన కృషిని స్మరించుకునేందుకు విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పేరు మార్చబడింది. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 25 ఏళ్లకు పైగా ఉనికిలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పేరును మార్చడం నాకు బాధ కలిగించింది. కేవలం రాజకీయ లాభం కోసం చాలా మందికి భావోద్వేగాలతో ముడిపడివున్న ఈ అంశాన్ని వాడుకోవటం తప్పు”…అని కళ్యాణ్ రామ్ అన్నారు.