Viral News : ఇటీవల విడాకులు తీసుకున్న భర్తలందరూ కలిసి గ్రాండ్గా పార్టీ చేసుకోవాలనుకున్న విషయం గుర్తుందా? ఈ న్యూస్ బాగా వైరల్ అయ్యింది. అలాంటి ఘటనే ఇది. కొంతమంది భర్తలు తమ భార్యలకు పిండ ప్రదానం చేయాలనుకున్నారు. అయితే వీరి భార్యలు చనిపోలేదండోయ్. లక్షణంగా బతికే ఉన్నారు. కానీ వీరు మాత్రం పిండం పెట్టి వారికో దండం పెట్టాలనుకున్నారు. ముంబైలో జరిగిందీ ఘటన. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. భార్యలు బతికుండగానే భర్తలు పిండాలు పెట్టారు. మరి భార్యలు బతికుండగానే పిండాలు ఎందుకు పెట్టారో తెలుసా?
మహారాష్ట్రలోని ముంబైలోని నది ఒడ్డున ఆదివారం రోజున పితృపక్షం, శ్రాద్ధ మాసం జరిగింది. అయితే ప్రతి ఏటా ఈ మాసంలో అక్కడి ప్రజలు చనిపోయిన వారికి పిండ ప్రదానం చేస్తారు. విచిత్రం ఏంటంటే.. ఈ సంవత్సరం 50 మంది భర్తలు బతికున్న తమ భార్యలకు పిండ ప్రదానం చేశారు. ఇది ఆ నోటా ఈ నోటా పాకి.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివాహానికి సంబంధించిన చెడు జ్ఞాపకాలను వదిలించుకోవడానికి వీరంతా పూర్తి ఆచార సాంప్రదాయాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పిండ ప్రదానం సమయంలో కొందరు గుండు కూడా చేయించుకున్నారు.
Viral News : భర్తల బాధను ఎవరూ అర్ధం చేసుకోవడం లేదు..
ఈ పిండ ప్రదాన కార్యక్రమాన్ని వాస్తవ్ అనే పౌండేషన్ నిర్వహించింది. పిండ ప్రదానం చేసిన భర్తలు మాట్లాడుతూ…‘‘ఇలా భార్యలకు పిండ ప్రదానం చేస్తే.. వారు శాంతించి, మాకు విముక్తి కల్పిస్తారు. పెళ్లి సమయంలో దంపతులు ఏడడుగులు కలిసి నడుస్తామని ప్రమాణం చేస్తాం. కానీ, ఎక్కువ జంటలు పెళైన కొద్ది రోజులకే చిన్న చిన్న వివాదాలతో కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి. అయితే ఈ సమయంలో మహిళలకే మద్దతు వస్తోంది. భర్తల బాధను ఎవరూ అర్ధం చేసుకోవడం లేదు. అందుకే భార్యా బాధిత భర్తలందరం కలిసి ఈ పిండ ప్రదానం చేస్తున్నాం. గతంలో ఈ ఫౌండేషన్ వారణాసిలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సారి ముంబైలో ఈ పిండ ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమం వల్ల స్త్రీ వాదమనే విధానానికి కూడా తర్పణం వదులుతున్నాం. స్త్రీ వాదానికి ముగింపు పలికి, సమాజంలో స్త్రీ, పురుషుల సమానత్వం వస్తుంది” అని భార్యల బాధిత భర్తలు తెలిపారు.