హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్ క్లబ్ లో ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 20 కోట్ల వరకు ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. దీంతో క్లబ్ మొత్తం మంటలు వ్యాపించాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులుకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించి మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించారు. సెలవులు కావడంతో..
ఘటనా స్థలానికి జూబ్లీ బస్టాండ్ దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతానికి రాకపోకలను నిలిపివేశారు. చుట్టుపక్కల కూడా ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. పండుగ రోజులు కావటంతో తెల్లవారు జాము వరకూ కార్యక్రమాలు జరిగాయని స్థానికలుఉ చెబుతున్నారు. అయితే చుట్టుపక్కల ప్రాంతాల వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. క్లబ్లో జరిగిన అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బ్రిటీష్ హయాంలో..ఇక ఈ క్లబ్ చరిత్ర ఒకసారి చూస్తే.. 1879లో బ్రిటీష్ హయాంలో మిలిటరీ అధికారుల కోసం ఈ క్లబ్ నిర్మాణం చేశారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో సికింద్రాబాద్ క్లబ్ నిర్మాణం జరిగింది. భారతీయ వారసత్వ సంపదగా 2017లో గుర్తించి పోస్టల్ కవర్ విడుదల చేశారు. సికింద్రాబాద్ క్లబ్లో 300 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్ క్లబ్లో 5వేల మందికి పైగా సభ్యత్వం ఉంది. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే, ప్రమాదం పైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని చెబుతున్నారు.
సికింద్రాబాద్ క్లబ్లో జరిగిన ప్రమాదంపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పేర్కొన్నారు. హెరిటేజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం జరగడం బాధాకరమన్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా హెరిటేజ్ బిల్డింగ్లో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సికింద్రాబాద్ క్లబ్ ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా.. హెరిటేజ్ భవనాలపై నిఘా పెట్టాలన్నారు. చారిత్రాత్మక కట్టడాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరైంది కాదని వీహెచ్ పేర్కొన్నారు.