PM Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు వచ్చిన బహుమతులను ఇ-వేలం వేయనున్నట్టు కేంద్రం వెల్లడించింది. మోదీకి వచ్చిన బహుమతులను రేపటి నుంచి అందుబాటులో తీసుకు రానున్నట్టు కేంద్ర సాంస్కృతిక పర్యటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఇ-వేలం ద్వారా బహుమతులను కొనుగోలు చేయవచ్చని కేంద్రం వెల్లడించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఒక కొత్త మార్గదర్శనం చేస్తున్నారని వెల్లడించారు. ప్రధానిగా ఎన్నో ప్రదేశాలు పర్యటిస్తారని.. ఎందరో ప్రధాన మంత్రులను కలుస్తూ ఉంటారని వెల్లడించారు.
ఎంతోమంది గౌరవంగా ప్రధాని మోదీకి బహుమతులు ఇస్తుంటారని.. దేశ చరిత్రలో మొదటిసారి ఆ బహుమతులన్నింటిని మళ్ళీ దేశం కోసం వెనక్కి ఇచ్చేస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఓ చిన్నారి మోదీ వేసుకున్న శాలువా కావాలని గతంలో లేఖ రాసిందని ఆయన గుర్తు చేశారు. స్పందించిన ప్రధాని శాలువాను చిన్నారికి పంపించారన్నారు. 2019 నుంచి ప్రతియేటా బహుమతుల వేలం జరుగుతోందన్నారు. ఈ సారి 1222 బహుమతులకు వేలం జరుగుతోందన్నారు. ఈ బహుమతులకు రూ. 2.7 కోట్ల సర్కార్ వారి పాట ( కనీస ధర) రావొచ్చన్నారు. క్రీడాకారులు ఇచ్చిన 25 బహుమతులు, వారి టి షర్ట్స్ వేలంలో ఉన్నాయన్నారు.
PM Modi : వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం నమూనా గిఫ్ట్ కూడా ఉంది
అయోధ్య రామమందిరం గిఫ్ట్ ఉందని.. వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వారణాసి కాశీ విశ్వనాథ ఆలయం నమూనా గిఫ్ట్ కూడా ఉందని వెల్లడించారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్, సర్ధార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్ విగ్రహం కూడా వేలంలో ఉన్నాయన్నారు. వేలం ద్వారా వచ్చిన నిధులను నవామి గంగ కోసం కేటాయిస్తామన్నారు. ఇ-వేలంలో 100 రూపాయల నుంచి 5 లక్షల వరకు బిడ్డింగ్ ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆసక్తి ఉన్నవారెవరైనా ఈ బహుమతుల కోసం వేలం పాటలో పాల్గొన వచ్చని తెలిపారు. గతంలోనూ మోదీ తాను ధరించిన డ్రెస్ను వేలంలో పెట్టిన విషయం తెలిసిందే. ఆ డ్రెస్ రూ.3 కోట్లకు పైగా పలికింది.