Congress Party : గోవాలో కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వారంతా ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, అసెంబ్లీ స్పీకర్ను కలిశారు. దీంతో గోవా కాంగ్రెస్ పార్టీలో కలకలం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీఎం దిగంబర్ కామత్, ప్రతిపక్ష నేత మైఖైల్ లోబోలతో కలిసి మొత్తం 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం బీజేపీ జెండా కప్పుకోనున్నారు. దిగంబర్ కామత్, మైఖైల్ లోబో, దేలిలాహ్ లోబో, రాజేష్ ఫలదేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోనకర్, అలెక్సో సీక్వెరియా, రుడాల్ఫ్ ఫెర్నాండేజ్ లు గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
గోవాలో ఈ ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 40 స్థానాలకు గానూ బీజేపీ 20 సీట్లు దక్కించుకొంది. మెజార్టీ మార్కుకు ఒక్క సీటు తగ్గడంతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు వారిలో ఎనిమిది మంది బీజేపీలో చేరడం ఖాయమైంది. అంటే మూడింట రెండొంతుల మంది పార్టీని వీడితే.. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటును కూడా తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఇక సావంత్ను కలిసిన నాయకుల జాబితాలో గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, మైకెల్ లోబో సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నారు. ఒకవైపు పార్టీలో ఫైర్ను నింపేందుకు ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన తరుణంలో ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడటం కలకలం రేపుతోంది.
Congress Party : గోవా అసెంబ్లీ సమావేశానికి ఒక రోజు ముందు..
గోవా కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీకి ముగ్గురే మిగులుతారని గోవా బీజేపీ అధ్యక్షుడు సదానంద చెప్పారు. రెండు నెలల క్రితం కూడా కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ సమావేశానికి గైర్హాజరు కావడంతో ఈ తరహా వార్తలే వచ్చాయి. గోవా అసెంబ్లీ సమావేశానికి ఒక రోజు ముందు కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయగా.. ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. త్వరలోనే వారంతా భాజపాలో చేరతారన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ను రంగంలోకి దింపి నాటి సంక్షోభం సద్దుమణిగేలా చూశారు. తిరిగి నేడు 8 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటం గమనార్హం.